తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Friday 27 June 2014

పుష్కరాలను ఎలా నిర్ణయిస్తారు?? త్రివేణీ సంగమమంటే ఏమిటి?

పుష్కరాలను ఎలా నిర్ణయిస్తారు??
త్రివేణీ సంగమమంటే ఏమిటి?? ఎక్కడెక్కడ ఉన్నాయి??
ప్రకృతిని పూజించే సంస్కృతి మనది. అందులోను జీవనాధారమైన నీటికి నిలయమైన నదులను దేవతలుగా పూజిస్తాం. జనజీవితమంతా నదులతోనే ముడిపడి ఉంది. నదులు ప్రవహించే ప్రాంతాలే నగరాలైనాయి. నాగరికత పెంపొందించటానికి నదులే కారణం. 'హిందు' అనే పదం సింధు నుంచే వచ్చింది. చినుకులా రాలి, ఏరులై పారి, నదులుగా మారి, వరదలై పొంగి, కడలిచేరే దశలలో ఎన్ని మలుపులు! ఎన్ని సొగసులు! ఎన్ని కడగండ్లు! ఎన్ని పరిమాణాలు! కఠిన శిలల్లో ప్రయాణం, అవరోధాలను అధిగమించటం, కాలుష్యాలను భరించటం, పయనించినంత దూరం నేలతల్లిని సస్యశ్యామలంగా మార్చటం, పుణ్యక్షేత్రాలలో భగవంతునికి తనవంతు కైంకర్యం సమర్పించటం, క్షేత్రాన్ని తన తీర్థంతో పావనం చేయటం, ఉపనదులను కలుపుకోవటం, ప్రకృతి భీభత్సాలను భరించటం, నాగరికత తెచ్చే మార్పులన్నీ సహించటం చూస్తే నది మనకు ఒక మహోన్నత మార్గదర్శిగా కనిపిస్తుంది. నదీతీరాలన్నీ పుణ్యక్షేత్రాలకు నిలయాలే. నది మన సంస్కృతిలో ఎంత ప్రధానపాత్ర వహిస్తుందంటే మనం సంకల్పం చెప్పుకుంటూ, మన ఉనికి తెలుపుతూ (గంగా గోదావర్యోర్మధ్యప్రదేశ్) ఏఏ నదుల మధ్య ఉన్నామో చెప్పుకుంటాం.
వామనావతారంలో ఆకాశానికెత్తిన విష్ణుపాదాన్ని బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళతో కడిగాడట. ఆ పవిత్ర జలమే విష్ణు పాదోద్భవ అయిన గంగానదిగా అవతరించింది.
పరమశివుడు తన జటాజూటంనుండి గంగను వదిలేటప్పుడు, ఆయన దాన్ని ఏడుపాయలుగా వదిలాడు. మూడు పాయలు (హ్లాదిని, పావని, నళిని) తూర్పు దిక్కుగా ప్రవహించాయి. మరో మూడు పాయలు (సుచక్షువు, సీతా, సింధు) పశ్చిమ దిక్కుగా వెళ్ళాయి. ఏడవపాయ భగీరధుడిని అనుసరించి వచ్చింది. భగీరధుడు ఒక దివ్యరధంలో ముందు ప్రయాణం చేస్తుండగా, గంగ ఆ రధం వెనకే ఉరవళ్ళు, పరవళ్ళతో ప్రవహిస్తూ వెళ్ళింది, ఈ ప్రయత్నానికి సమకట్టిన భగీరధుని పేరుమీదుగానే ఆ నదికి భాగీరథి అని పేరు వచ్చింది.
భాగీరధి, జాహ్నవి, అలకనంద ఉపనదులు కలసి హరిద్వార్ వద్ద గంగగా ప్రయాణం సాగించాయి. నదులన్నీ ఆ గంగాదేవికి ప్రతిరూపాలుగానే భావిస్తారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమాన్ని 'త్రివేణి సంగమం' అంటారు. ఆ పవిత్ర భూమి ప్రయాగ. యమున సూర్య తనయ. జన్మస్థానం యమునోత్రి.
నీలమేఘశ్యాముని యమునా తీర రాసలీలలకు ప్రత్యక్షసాక్షి. తాను నల్లగా వుండి ఆ నల్లనయ్యనకు ప్రీతిపాత్రురాలైంది.
ఇక సరస్వతి బ్రహ్మపత్ని. వాగ్దేవి, జ్ఞాన ప్రదాయిని. త్రివేణి సంగమ ప్రాంతంలో సరస్వతి అంతర్వాహిని, పన్నెండేళ్ళకొకసారి గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలొస్తాయి. ఉదాహరణకు గురుడు మేషరాశిలో ప్రవేశిస్తే గంగాక్, కర్కాటకరాశిలో ప్రవేశిస్తే యమునకు, మిథునరాశిలో ప్రవేశిస్తే సరస్వతికి సింహరాశిలోకి ప్రవేశిస్తే గోదావరికి, తులారాశిలోకి వస్తే కావేరికి, కన్యారాశిలోకి వస్తే కృష్ణా నదికి ఇత్యాదిగా పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో ఆయా నదులలో సమస్త దేవతలు ఉంటారనీ, పుష్కర స్నానం పాపాలను కడిగివేస్తుందని అంటారు.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.