తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Sunday 14 June 2015

సరస్వతీ ఆలయం - బాసర

www.onenandyala.com

సరస్వతీ ఆలయం - బాసర
విధాత అర్థాంగిగా సరస్వతీదేవికి హైందవ ఆధ్యాత్మిక జగత్తులో విశిష్ఠస్ధానం ఉంది. కానీ..సకల కళామతల్లి అయిన సరస్వతీదేవికి మన దేశంలో కేవలం రెండు ఆలయాలే ఉండడం ఆశ్చర్యకరం. ఒకటి ఉత్తరభారతదేశంలోని కాశ్మీరంలో ఉన్న ‘శరణాలయం’. రెండవది తెలంగాణా రాష్టంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ‘బాసర’ గ్రామంలో ఉన్న సరస్వతీదేవి ఆలయం.
మహాకాళీ..మహాలక్ష్మీ..మహాసరస్వతిగా కీర్తించబడే సరస్వతాదేవి సకల విద్యలకు అధిదేవత. ఎంత ధనమున్నా.., విద్య లేనివాడు వింత పశువే. కనుక ప్రతి మానవునకూ సరస్వతీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తొలి అక్షరాభ్యాసాన్ని బాసరలోని సరస్వతీదేవి ఆలయంలో జరిపిస్తారు.
బాసరలోని సరస్వతీదేవి ఆలయం అతి పురాతనమైనది., చారిత్రాత్మకమైనది. ఆదికవి అయిన వాల్మీకిమహర్షి బాసరలో సరస్వతీదేవి ప్రతిష్ఠ చేసాడనీ., ఇక్కడే శ్రీమద్రామాయణాన్ని రచించాడనీ.,బ్రహ్మాండ పురాణంలో ఉన్నట్లు పెద్దలు చెప్తారు. ఈ ఆలయం క్రీ.శ.4వ శతాబ్దికి పూర్వంనుంచీ ఉన్నదనీ.,ఈ క్షేత్రం రాష్ట్రకూటుల కాలంనాటిదనీ చరిత్రకారులు చెప్తారు.
సరస్వతీదేవి ఆలయం సమచతురస్రాకారంలో ఉంటుంది. ఆలయానికి దక్షిణభాగాన కోనేరు ఉంది. దీనిని ‘గుండం’ అని ప్రాంతీయులు పిలుస్తారు. దానికి ప్రక్కగా ఒక సమాధి ఉంది. దానిని ‘వాల్మీకి సమాధి’ అని అర్చకులు భక్తులకు పరిచయం చేస్తారు. శివరాత్రి మొదలు ఇక్కడ ఉత్సవాలు చేస్తారు. బాసరక్షేత్రం చేరుకోవడానికి రైలుమార్గం కూడా ఉంది. ఈ క్షేత్రానికి రెండు మైళ్ళ దూరంలో రైలుస్టేషన్ కూడా ఉంది. అందరూ చూసి తరించతగ్గ పుణ్యక్షేత్రం బాసర.

No comments:

Post a Comment

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.